గన్నేరువరం, వెలుగు: ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు కొందరు యువకులు, పిల్లలు బావులు, చెరువుల్లో ఈత కొడుతున్నారు. కానీ ఇది ప్రమాదకరం కావడంతో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కూనవానిపల్లెకు చెందిన యాదగిరి వినూత్నంగా ఆలోచించి తన ట్రాక్టర్ ట్రాలీనే స్విమ్మింగ్ పూల్గా మార్చాడు. ట్రాలీలో టార్పాలిన్ కవర్ వేసి అందులో నీళ్లు నింపాడు. ఇందులో చిన్నారులు ఈత కొడుతూ సందడి చేశారు.
